pidigam nagaiah

Pidigam Nagaiah, Editor, teluguraitu.com

పిక్స్ (PICS)  సంచులు  పంట కోత అనంతరం పురుగుల తాకిడికి గురై నష్టపోకుండా గింజలు, ధాన్యాలు, ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కాపాడేవి. వీటిని ముఖ్యంగా వరి, గోధుమ, కంది, సజ్జ, జొన్న, పెసర, మినుము, మక్కజొన్న, వేరుశనగ, మిరప నిల్వలకు సమర్థవంతంగా వాడుకోవచ్చు. మొదటిసారిగా పశ్చిమాఫ్రికా దేశంలో బొబ్బర్ల నిల్వకు ఈ సంచులను వాడారు. తర్వాత ఆసి యా, ఇతర ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షల PICS సంచులు రైతులు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో PICS పరిజ్ఞానాన్ని తెలుసుకొని సక్రమంగా వాడుకునే విధానం తెలుసుకుందాం.  

పిక్స్ సంచుల గురించి..


ఇవి గాలి చొరబడని మూడు పొరల సంచులు. లోపలి రెండు పొర లు 80 మైక్రాన్ల మందం కలిగి ఉంటాయి. ఇవి అధిక సాంద్రత కలిగిన పాలిఎథిలిన్‌తో తయారు చేయబడినవి. మూడో పొర- పాలిప్రొఫిలీన్‌తో తయారు చేయబడినది. ఈ మూడు కలిస్తేనే పురుగు లు, శిలీంధ్రాలు నిర్మూలించే శక్తి కలిగి ఉంటాయి.



ఎండు మిరపపై పరిశోధనలు..


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఎండు మిరప సాగు ఎక్కువగానే ఉన్నది. అయితే కోతప్పుడు, అనంతరం కూడా గాలిలో తేమ 85 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ఎండబెట్టేటప్పుడు మట్టి అంటితే  ఈ బూజు తెగులు సమస్య పెరుగుతుంది. అస్పర్జిల్లస్, ఫ్లేవస్ అనే శిలీంధ్రం చేరి, అభివృద్ధి చెంది, ఎండు మిరపను నల్లని బూజు ఆశిస్తుంది. ఈ శిలీంధ్రం అఫ్లాటాక్సిన్ అనే క్యాన్సర్ కలుగజేసే కార్సినోజెన్‌ను విడుదల చేస్తుంది. ఈ కారకం ఉన్న మిరపను తింటే క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీర నిరోధకత దెబ్బతింటుంది. ముఖ్యంగా వృద్ధులలో ఈ లక్షణాలు ఎక్కువగా కన్పిస్తాయి.

ఎగుమతులపై ప్రభావం


భారత్ ప్రపంచంలో ఎండు  అత్యధికంగా పండించే, వాడే, ఎగుమతి చేసే దేశం. అయితే ఈ శిలీంధ్రం దేశమంతటా ఉన్నది. మిరప కోసే సమయంలో లేదా ఆ తర్వాత భూమిపైన ఆరబడితే భూమిలోని శిలీంధ్రాలు మిరపలో చేరి నల్లబూజును అభివృద్ధి చేస్తాయి. దేశంలో ఇప్పటి వరకు ఈ బూజు రాకుండా నిరోధించే రకాలు లేవు. కాబట్టి రైతులు ఎండు మిరప నిల్వ చేసే సంచులలో శిలీంధ్ర నాశనులు వాడుతారు. దీనివల్ల ఎండు మిరపలో పురుగు మందుల అవశేషాలు ఉంటాయి.
ఇక ఎగుమతుల విషయానికి వస్తే భారత్ నుంచి ఎండు మిరప ఎగుమతులు అమెరికా, బ్రిటన్, పశ్చిమాసియా దేశాలు, ఇతర ఆసియా దేశాలకు వెళ్తాయి. అయితే ఆయా దేశాలు దిగుమతులు తీసుకునేందుకు కొన్ని ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఎండు మిరపలో 20 పీపీబీ మించరాదు. మన రాష్ర్టాలు, దేశం నమూనాలలో 30 పీపీబీ నుంచి 960 పీపీబీ వరకు ఉంది. దీంతో తిరస్కరణకు గురవుతున్నాయి. దేశీయంగా ప్రాసెసింగ్ పరిశ్రమలు వీటిని వాడితే నష్టాలు ఎక్కువే. కాబట్టి అఫ్లాటాక్సిన్‌ను రసాయనేతర విధానాల ద్వారా నిర్మూలించాలి.



శాస్త్రీయ పరిశోధనలు


అన్ఫర్జిల్లస్ సమస్యను నిర్మూలించే ఉద్దేశంతో మేము ఎండు మిరపపై ప్రయోగాలు చేపట్టాం. మూడు పొరల సంచులను అమెరికాలోని పర్డూ విశ్వవిద్యాలయం నుంచి దిగుమతి చేసుకున్నాం. 10 శాతం తేమ కలిగిన ఎండు మిరపలో కృత్రిమంగా పెంచి అస్ఫర్జిల్లస్ ఫ్లేవస్ శిలీంధ్రాన్ని పది శాతం వరకు ఆరోగ్యవంతమైన ఎండు మిరపకు పట్టించి మూడు పొరల సంచిలో ఒక నమూనాను, సాధారణ గోనె సంచులలో మరో నమూనాను, పాలిథీన్ సంచులలో పురుగు మందును పిచికారీ ఇంకో నమూనాను 8 నెలల పాటు సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉంచి గంట గంటకు కొలిచే డాట్‌లాగర్స్ ఉంచాం. వాటిని కంప్యూటర్‌కు అనుసంధానించాం. ప్రతి పది రోజులకు ఒకసారి సంచుల లోపల ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ లెక్కించాం. మూడు పొరల సంచులలో ఆక్సిజన్ బాగా తగ్గింది. కార్బన్ డై ఆక్సై డ్ బాగా పెరిగింది. దీంతో శిలీంధ్రం పూర్తిగా చనిపోయింది. అదే సయంలో గోనె సంచులలో బూజు విపరీతంగా పెరిగిపోయి, ఎండు మిరప మొత్తం పాడైంది. ఎనిమిది నెలల కాలంలో మిరప ధరలు పెరిగాయి. కాబట్టి మూడు పొరల సంచి ఖరీదు సైతం పెరిగిన ధర లో వీగిపోయింది. ఇదే తరహాలో చిక్కుడు గింజలను నిల్వ చేసిన పరిశోధనలో పల్స్ బీటిల్ కూడా చనిపోయింది. ఈ సంచులలో నిల్వ చేసిన గింజల నాణ్యత తగ్గలేదు. మొలక శాతం బాగుంది. ఇతర పోషకాల నష్టం జరుగలేదు.
బొబ్బర్లను మూడు సీజన్ల వరకు ఈ సంచులలో నిల్వ చేసుకోవ చ్చు. ఒకవేళ PICS సంచులు గాలిని లోపలికి అనుమతిస్తే తక్కువ నష్టపరిచే పురుగుల ఉధృతి ఉండే పంటల ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు వాడుకోవచ్చు.


సంచుల వాడే కాలం పెంచేందుకు


 చెత్తలేని ఉత్పత్తులను మాత్రమే నిల్వ చేయాలి. లేదంటే లోపలి పొరలకు రంధ్రాలు పడుతాయి.
 సంచులను ముడి వేసేటప్పుడు, రవాణా చేసేటప్పుడు దెబ్బ తినకుండా చూసుకోవాలి.
శుభ్రమైన గదులలోనే భద్రపరుచాలి. ఎలుకలు, ఇతర కీటకాలు లేకుండా నిర్మూలించాలి.
 అధిక ఉష్ణోగ్రత, నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి.
చిన్న, సన్న రంధ్రాలు ఉంటే ఎప్పటికప్పుడు టేప్‌తో అతికించి గాలి చొరబడకుండా చూసుకోవాలి.
రీసైక్లింగ్
మూడు నాలుగేండ్ల తర్వాత పురుగులు ఆశించినా  పెద్దగా నష్టం కలుగని ఉత్పత్తుల నిల్వకు  చివరి పొర సంచిని రైతులు  వాడుకోవచ్చు.
చాపలు, తాడుల తయారీకి కూడా వాడుకోవచ్చు.
HDPE (అధిక సాంద్రత కలిగిన పాలీ ఎథిలిన్) పొరలను స్థాని క ఆహార రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నిల్వకు వాడుకోవచ్చు.
 వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌గా కూడా వాడుకోవచ్చు.
 ఈ సంచులకు పురుగు మందులు పిచికారీ చేయరు. కాబట్టి ఇండ్లలోనూ ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
చాలామంది రైతులు ధాన్యం అమ్మేటప్పుడు సంచులతో సహా అమ్మరు. వేరే డబ్బాలలో పోసి, అనంతరం విక్రయిస్తారు.

తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారం అయితే చిన్న, సన్నకారు రైతులు వరి, అపరాలు, చిరుధాన్యాలు పండిస్తున్న రైతులు పండించిన వాటిలో కొంత మేరకు దాచుకొని, తర్వాత కాలంలో విత్తనంగా వాడుకుంటున్నారు. అయితే 6-12 నెలల నిల్వ కాలంలో పుచ్చులు వచ్చి, పురుగులు పడి నాణ్యత దెబ్బతిని మొలక శాతం తగ్గిపోతుంది. అందుకే రైతులు విత్తన కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన నిల్వ సంచులను ప్రభుత్వమే సబ్సిడీతో అందజేస్తే మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు. ఆఫ్రికా దేశాలలో మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అక్కడి రైతులకు ఈ బ్యాగులను సబ్సిడీతో అందిస్తున్నారు. ఫలితంగా విత్తన కొరత తీరింది. రైతుల కష్టాలు తగ్గాయి.

గాలి చొరబడని సంచులు

సాధారణంగా రైతులు తమ ధాన్యాన్ని, విత్తనాన్ని పురుగు పట్ట కుండా, బూజు రాకుండా కాపాడటానికి వివిధ పద్ధతుల ద్వారా నిల్వ చేసుకుంటారు. ఇందులో కొన్ని పద్ధతులు-గోనె సంచి, ఎరువుల సంచి, మట్టి తో లేదా లోహంతో చేసిన డ్రమ్ములో నిల్వ చేస్తారు. ఇలా చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ధాన్యంలో పురుగు పుట్టి అభివృద్ధి చెందుతుంది. రైతుకు కొన్ని సందర్భాల్లో 15-50 శాతం వరకు నష్టం వస్తుంది. నాణ్యత, బరువు, బూజు శిలీంధ్రాలు -వీటన్నింటి వల్ల మార్కెట్‌లో అమ్మేటప్పుడు రైతుకు సరైన ధర లభించదు. (అసలైతే పంట కోతకు వచ్చిన సమయం కంటే ఆ తర్వాత నిల్వ చేసి అమ్మితే ఎక్కువ గిట్టుబాటు ధర రైతు కు రావాలి). దీనివల్ల  అనేక నష్టాలు ఉన్నాయి. 1) రైతులు కోత సమయంలోనే తమ పంటను తక్కువ ధరకు అమ్ముకోవడం 2) గోనె సంచిపై పురుగు మందు చల్లడం 3) పురుగుల మందుతో ధాన్యాన్ని నిల్వచేయడం. ఇటువంటి సమస్యలన్నీ అధిగమించడానికి ఈ PICS (పర్డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజీ) సంచు లను ప్రపంచవ్యాప్తంగా వాడు తున్నారు. ఈ టెక్నాలజీలో గాలి చొరబడని మూడు పొరల సంచులను వినియోగిస్తారు.
మనందరికీ తెలుసు జీవరాశులన్నింటికీ (పురుగులు కూడా) ప్రాణవాయువు ఆధారం. ఎప్పుడైతే ప్రాణవాయు వు కావలసిన మోతాదులో ఉండదో పురుగుల అభివృద్ధి ఆగిపోతుంది. ఈ టెక్నాలజీలో ఇదే ప్రధాన సూత్రం.
ఆదాయం, ఆహార రక్షణ, కలుషితం లేని ఆహారం, విత్తన నాణ్య త పెంపొందించడమే ధ్యేయంగా ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో రైతులు వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ వాడ కంపైన  56,000 గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇవ్వబడింది. కోటికి పైగా సంచులు వాడుతున్నారు. ప్రతి క్వింటాలు ఉత్పత్తికి రూ. 1000-2000  ఆదా చేసుకున్నారు. ముఖ్యంగా ప్రపం చవ్యాప్తం గా  ఈ టెక్నాలజీని ఉపయోగించి బొబ్బర్ల నిల్వ (50 కేజీలు) ఎటువంటి పురుగు మందులు కాని రసాయనాలు కాని అవసరం లేకుండా ధాన్యాన్ని, విత్తనాన్ని సురక్షితంగా నిల్వ చేయవచ్చు.

ఈ సంచులు ఉపయోగించేటప్పుటు చేయవలిసినవి


నమ్మదగిన డీలర్ల వద్ద నాణ్యమైన సంచులను కొనాలి.
ధాన్యం సరైన తేమ శాతం కలిగేటట్టు చూసుకోవాలి.
అధిక తేమతో నిల్వ చేస్తే పనిచేయదు.
సంచుల లోపలి రెండు పొరల్లో చిల్లులు లేకుండా చూసుకోవాలి

చేయకూడనివి


సంచులను ఎండలో నిల్వ చేయవద్దు.
మధ్యమధ్యలో (నిల్వ సమయంలో సంచి తెరువరాదు)
గోడల పక్కన పెట్టకూడదు.
మూడు సంచులను విడదీసి వాడకూడదు. 

పల్లి నిల్వకు మూడు పొరల సంచులు

ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్ సూదిని మొదటిసారిగా 2011  నుంచి పల్లీల  నిల్వ కోసం ఈ సంచుల ను ఉపయోగించడంపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు. పర్డ్యూ యూనివర్సిటీ సహకారంతో సాగిన ఈ పరిశోధనలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో అనంతపురం జిల్లాలోని కొద్దిమంది ఎంపిక చేసిన రైతులకు ఈ మూడు పొరల సంచులను ప్రయోగాత్మకంగా ఇచ్చి వారిని  పల్లి నిల్వకు ఉపయోగించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత రైతుల అభిప్రాయాలను సేకరించినప్పుడు వారు ఈ సంచులు చాలా బాగా పనిచేశాయని చెప్పారు.

సంప్రదాయ పద్ధతిలో జనపనార/గోనె సంచులను ఉపయోగించి పల్లి కాయలను నిల్వ చేసినప్పుడు, బ్రూచిడ్ అనే పురుగు త్వరితగతిన వృద్ధి చెంది తీవ్ర నష్టం కలుగజేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మూడు పొరల సంచులను ఉపయోగించినప్పుడు కీటకాలను సమర్థవంతంగా నిలువరించి పల్లికాయల నాణ్యతను కాపాడుకోవచ్చని తేలింది. అంతేగాకుండా వేరుశనగలో విత్తన మోతాదు అధికం. ఎకరానికి దాదాపు 60-80 కిలోల విత్తనం వాడాలి.  రైతులు తాము పండించిన వేరుశనగ కాయలను మరలా వచ్చే కాలానికి అంటే దాదాపు 6-8 నెలల వరకు ఈ సంచులలో నిల్వ చేసుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. ఇక్రిశాట్ వారి పరిశోధనలో విత్తన మొలక శాతం కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ సంచులు పల్లి కాయలను కాపాడినట్లు తేలింది.

ఈ శాస్త్రీయమైన వేరుశనగ కాయల నిల్వను గుర్తించిన ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్ సూదిని పర్యవేక్షణలో యాభై వేల పిక్స్ సంచులను 17 జిల్లాల్లోని రైతులకు వేరుశనగ నిల్వ కోసం ఇప్పటికే  పంపిణీ చేసింది. వ్యవసాయ శాఖ దీన్ని ఒక పథకంగా అమలుచేస్తూ రైతులకు 90 శాతం సబ్సిడీపై ఈ సంచులను అందజేసింది.

– డాక్టర్ హరికిషన్ సూదిని, ఇక్రిశాట్,  శాస్త్రవేత్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.